_*తల్లి మందలించడంతో బాలుడు ఆత్మహత్య?*_
_సిరిసిల్ల జిల్లా: కొడుకు జల్సాలకు అలవాటు పడి పక్క దారి పడుతుండటంతో తల్లి మందలించింది. దీంతో కొడుకు మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని, వట్టిమల్ల గ్రామంలో గల కమ్మారిపేట తండాలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కమ్మరిపేట తండాకు చెందిన బానోవత్ రాజు-జ్యోతి దంపతుల కుమారుడు దినేష్ (17) జల్సాలకు అలవాటుపడి పక్కదారి పడుతున్నాడు. దీంతో ఆవేదన గురైన తల్లి దినేష్ను మందిలించింది. తల్లి తిట్టడంతో మనోవేదనకు గురైన బాలుడు గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి అటవీ ప్రాంతానికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయేముందు ఫోన్లో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటున్నానని.. అదే గ్రామానికి చెందిన తన మిత్రుడి వీడియో పంపించాడు. ఆ వీడియో చూసిన కుటుంబ సభ్యులు దినేష్ కోసం గాలించగా శుక్రవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతంలో దినేష్ మృతదేహం కనిపించింది._
_సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రమాకాంత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కి తరలించారు. కాగా, బాలుడి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో దినేష్ ఆవేదన వ్యక్తం చేయడంతో పలువురిని కంటతడి పెట్టించింది. ‘‘ఈ జీవితం మీద నాకు విరక్తి వచ్చింది. పుడితే డబ్బు ఉన్న వాడిగనే పుట్టాలి. ఇలా లేని జీవితంలో పుట్టడం.. నేను ఏమి చేయలేక ఇలా తిరుగుతుంటే అమ్మ నన్ను కొట్టడం నాకు అంత నచ్చడం లేదు. నేను మీ అందరినీ వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉంది. నన్ను క్షమించు అమ్మ. చెల్లెను మంచిగా చూసుకో’’ అని దినేష్ సెల్ఫీ వీడియోలో వాపోయాడు. దినేష్ మృతితో కమ్మరిపేట తండాలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
