సీపీ కనెక్ట్’ చొరవలో భాగంగా ప్రతిభ కనబరిచిన 07 మంది పోలీసు సిబ్బందిని అభినందించిన సీపీ రష్మి పెరుమాళ్, ఐపిఎస్
సిద్దిపేట జిల్లా, జులై 25, తెలుగు న్యూస్ 24/7
శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘సీపీ కనెక్ట్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 07 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కమిషనరేట్ కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు మరియు ప్రత్యేక కిట్లను అందజేశారు. అనంతరం సీపీ వారితో ముచ్చటించారు. గత వారం రోజులుగా విధినిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన క్రింది పోలీసు సిబ్బందిని సీపీ కొనియాడారు:1. ప్రజ్ఞాపూర్ ఆర్టిసి బస్టాండ్ వద్ద రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తుండగా, కానిస్టేబుళ్లు ఎస్. కృష్ణ, వి. రమేష్, ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో నిద్రపోతుండటాన్ని గమనించారు. వెంటనే అతడిని పోలీస్ స్టేషన్కు తరలించి, క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ ఎమ్. నరేందర్, సహాయంతో వేలిముద్రల పరికరం ద్వారా తనిఖీ చేశారు. సదరు వ్యక్తి పాత నేరస్థుడిగా తేలింది. నిందితుడిని విచారించగా, తిరుమలగిరి బస్టాండ్ పరిధిలో అతను దొంగిలించిన ఒక స్కూటీని రికవరీ చేశారు.2. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తుండగా, మార్కూక్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ యోనస్ అహ్మద్ అలీ, కానిస్టేబుళ్లు కిషోర్ కుమార్, ఉపేందర్ రెడ్డి, హోంగార్డ్ వేణు, లతో కలిసి కరకపట్ల వద్ద రాత్రిపూట వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో దొంగిలించబడిన 5 సబ్మెర్సిబుల్ పంప్ మోటార్లు లభ్యమయ్యాయి. సదరు దొంగిలించబడిన సొత్తుతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ, సాంకేతికతను ఉపయోగించి పాత నేరస్థులను పట్టుకోవడం, దొంగతనాలకు అడ్డుకట్ట వేయడం అభినందనీయం. ఇదే నిబద్ధతతో సిబ్బంది అంతా పనిచేసి కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలనీ సిబ్బందికి సూచించారు. ప్రజలకు సమర్థవంతంగా సేవ చేయడానికి ‘సీపీ కనెక్ట్’ చొరవ ద్వారా మరింత బలమైన, సమైక్య మరియు స్పందించే బృందాన్ని నిర్మించడానికి పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని సిపి రష్మీ పెరుమాళ్, తెలిపారు.





