ఏప్రిల్ 4,24/7 తెలుగు న్యూస్ : కేజ్రీవాల్ను సిఎంగా తొలగించాలన్న పిటిషన్ తిరస్కరణ.
న్యూఢిల్లీ : కేజ్రీవాల్ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలన్న పిల్ను ఢిల్లీ హైకోర్టు గురువారం మరోసారి తిరస్కరించింది. లిక్కర్ పాలసీ స్కాంకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత నెల కేజ్రీవాల్ను ఇడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్నారు. ” సిఎం స్వయంగా రాజ్యాంగ విధుల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే, గవర్నర్ సిఎంను తొలగించగలరా” అని సుప్రీంకోర్టు ఉత్తర్వులను సూచిస్తూ పిటిషనర్ విష్ణు గుప్తా హై కోర్టుని ప్రశ్నించారు.
ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదని, పాలనాపరమైన జోక్యం చేసుకోలేమని మార్చి 28న ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కెజ్రీవాల్ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించాలంటూ సూర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.




